అమెరికాలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండడంతో అధ్యక్షుడు జో బైడెన్ నిబంధనలు కఠినతరం చేశారు.

వచ్చేవారం నుంచి అమెరికాలో అడుగుపెట్టేవారు ఎవరైనా తమ ప్రయాణానికి ముందు 24 గంటలలోపు కోవిడ్ టెస్ట్ చేయించుకుని నెగటివ్ రిపోర్ట్‌తో రావాలి. ఇతర దేశాల నుంచి అమెరికన్లకూ ఈ నిబంధన వర్తిస్తుంది. రెండు డోసుల వ్యాక్సీన్ పూర్తయినవారు కూడా టెస్ట్ నెగటివ్ రిపోర్ట్‌ ఉంటేనే అమెరికాకు రావాలని నిబంధన విధించారు.

ఇటీవల కరోనా బారినపడి కోలుకున్నవారైతే అందుకు సంబంధించిన పత్రాలు చూపించాల్సి ఉంటుంది. విమానాలు, రైళ్లు, బస్సులలో మాస్కు ధారణ తప్పనిసరి.. మార్చి వరకు ఈ నిబంధన అమలులో ఉంటుంది. ఇప్పటివరకు అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 10 నమోదయ్యాయి. కాలిఫోర్నియా, కొలరాడో, మిన్నెసోటా, న్యూయార్క్, హవాయిలో ఈ కేసులు వెలుగుచూశాయి. వీరిలో హవాయికి చెందిన వ్యక్తి ఎక్కడికీ ప్రయాణాలు చేయనప్పటికీ ఆయనలో ఒమిక్రాన్ వేరియంట్ కనిపించిందని అధికారులు చెబుతున్నారు.

ఒమిక్రాన్ వేరియంట్ కరోనా బారినపడిన వారంతా స్వల్ప లక్షణాలతోనే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలలో ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంటుందా.. వ్యాక్సీన్లకు ఇది లొంగుతుందా లొంగదా అనే విషయంలో ఇంకా ఎలా స్పష్టత రాలేదు. ఈ చలికాలంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో అర్హులంతా కోవిడ్ వ్యాక్సీన్ బూస్టర్ డోస్ వేయించుకోవాలని అమెరికా ప్రభుత్వం తన ప్రజలకు చెబుతోంది. అమెరికా, మరికొన్ని దేశాలు ఆఫ్రికా ఖండంలోని 8 దక్షిణ దేశాలకు రాకపోకలు నిషేధించాయి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి