Coronavirus: కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. థార్డ్‌ వేవ్‌ తర్వాత పరిస్థితులు మెరుగవుతున్నాయి, కేసులు తగ్గుతున్నాయని అందరూ సంతోషించే లోపే మరోసారి ప్రపంచంపై విరుచుకుపడడానికి సిద్ధమవుతోంది. గత కొన్ని రోజులుగా ప్రపంచంలోని పలు దేశాల్లో..

Coronavirus: కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. థార్డ్‌ వేవ్‌ తర్వాత పరిస్థితులు మెరుగవుతున్నాయి, కేసులు తగ్గుతున్నాయని అందరూ సంతోషించే లోపే మరోసారి ప్రపంచంపై విరుచుకుపడడానికి సిద్ధమవుతోంది. గత కొన్ని రోజులుగా ప్రపంచంలోని పలు దేశాల్లో నమోదవుతోన్న కొత్త కేసులే దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. చైనా, సౌత్‌ కొరియాలాంటి దేశాల్లో ఒక్కసారిగా పెరిగిన కేసులతో ప్రపంచం మరోసారి ఉలిక్కి పడుతోంది.

కరోనా ఫోర్త్‌ వేవ్‌ వచ్చేస్తోందా.. అన్న ప్రశ్నలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ముఖ్యంగా చైనాలో కరోనా కొత్త వేరియంట్‌ భయపెడుతోంది. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ ముప్పు పెరుగుతోంది. ఈ సబ్‌ వేరియంట్‌పై చైనా ప్రభుత్వం ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తోంది. మంగళవారం ఒక్కరోజే కొత్తగా 5,280 కరోనా కేసులు నమోదుకావడంతో మళ్లీ డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయి. చైనాలో పెరుగుతోన్న కరోనా కేసులు భారత్‌లో సైతం కళకళం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనాలో పెరుగుతోన్న కరోనా కేసులు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపనుంది.? కరోనా పూర్తిగా ఎప్పుడు అంతమవుతుంది.? లాంటి ఆసక్తికర విషయాలను ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్‌ ఎమ్‌ విద్యాసాగర్‌ పంచుకున్నారు..

ప్రస్తుతం చైనాలో పెరుగుతోన్న కేసులకు భారత్‌తో పోల్చాల్సిన అవసరం లేదని ఐఐటీ ప్రొఫెసర్‌, నేషనల్ కోవిడ్ సూపర్‌ మోడల్‌ కమిటీ అధినేత డాక్టర్‌ ఎమ్‌ విద్యాసాగర్‌ తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయన్నారు. ఇక చైనాలో పెరుగుతోన్న కేసులు విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘చైనాలో కేసుల సంఖ్య రిపోర్టింగ్ చేయడంలో విభిన్న విధానాన్ని అవలంభిస్తున్నారు. చైనా జీరో కోవిడ్‌ పాలసీ గురించి మనందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితిల్లోనూ ఎక్కువ జన సాంధ్రత ఉన్న షాంగే లాంటి పట్టణంలో కొన్ని కేసులు నమోదవుతుండడంపై చైనా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. చైనా అవలంభించిన విధానం డెల్టా వేరియంట్ సమయంలో మంచి ఫలితాలు ఇచ్చాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇది విజయవంతమవుతుందని అనుకోవడం లేదు. ముఖ్యంగా భారతదేశంలో ఈ అవకాశాలు తక్కువగా ఉన్నాయ’ని చెప్పుకొచ్చారు.

హాంగ్‌కాంగ్, సౌత్‌ కొరియా వంటి దేశాలు వ్యాధిని నియంత్రించడంపై కాకుండా దానిని కప్పిపుచ్చేందుకే చర్యలు తీసుకున్నాయి. ఇది ఒక ప్రెషర్‌ కుక్కర్‌పై మూత ఉంచి స్టవ్‌ వెలిగించడం లాంటిదే. ఇది శాశ్వత నివారణ చర్య కాదు. సహజ నిరోధక శక్తి కంటే ఎక్కువగా వ్యాక్సిన్‌పైనే ఆధారపడ్డారు. ఆ దేశాల్లో కేసులు ఈ సంఖ్యలో పెరగడానికి ఇదే కారణంగా చెప్పవచ్చు’ అని ప్రొఫెసర్‌ అభిప్రాయపడ్డారు. ఇక భారత్‌ విషయానికొస్తే కరోనాను ఎదుర్కోవడంలో మనం మెరుగ్గా ఉన్నాము. జనాభాలో 98 శాతం కనీసం ఒక డోస్‌ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. 81 శాతం రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ తీసుకున్నారు. మా విశ్లేషణ ఆధారంగా ప్రజల్లో రోగ నిరోధక శక్తి చెక్కు చెదరకుండా ఉందని తేలింది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి